నేనంటే రామారావుకు ఎంతో అభిమానం..

ప్రఖ్యాత సీనియర్ జర్నలిస్ట్, సినీ పీఆర్వో పసుపులేటి రామారావు మృతిపట్ల టాలీవుడ్ నటుడు చిరంజీవి తీవ్రదిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. రామారావు పార్థీవ దేహం వద్ద పుష్పగుచ్చం ఉంచి నివాళులర్పించారు. రామారావు కుటుంబసభ్యులను ఓదార్చారు. రామారావు ఆత్మకు శాంతిచేకూరాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తూ.. ఆయన కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. 


అనంతరం చిరంజీవి మాట్లాడుతూ..రామారావు తనకు ఆత్మబంధువని అన్నారు. రామారావు జర్నలిస్టుగానే కాకుండా వ్యక్తిత్వం పరంగా తనకెంతో ఇష్టమైనవారని చిరంజీవి గుర్తు చేసుకున్నారు. రామారావు గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతుంటే వైద్యం చేయించుకోవాలని చెప్పి హాస్పిటల్ కు పంపించాను. మోకాళ్ల ఆపరేషన్ చేయించుకోవాలని డాక్టర్లు ఆయనకు సూచించారు. అయితే తన సోదరికి ఆరోగ్యం బాగా లేదని, ఆమె కోలుకున్న తర్వాత చేయించుకుంటానని రామారావు చెప్పారు. నేనంటే ఆయనకు విపరీతమైన అభిమానం. ఆయనంటే కూడా నాకెంతో గౌరవం, అభిమానం. నీతి, నిజాయితీ, నిబద్దతకు ప్రతిరూపం పసుపులేటి రామారావు అని చిరంజీవి అన్నారు.